● చెరువులు, గుట్టల్లో అక్రమ తవ్వకాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
డోన్ రూరల్: అధికార పార్టీ అండదండలతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, వంకలు, వాగులు, గుట్టల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. వెంకటనాయునిపల్లె, రేకులకుంట, లక్ష్మింపల్లె, ఓబులాపురం మెట్ట, జగదుర్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ దందా దర్జాగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ, వే బిల్లుల రూపంలో రుసుం చెల్లించకుండా రెండు చేతులా జేబులు నింపుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో రేయింబవళ్లు జేసీబీలతో గ్రావెల్ను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు ఏమి తెలియనట్లు వ్యహరిస్తుండటంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు జగదుర్తి, కొచెర్వు చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి రైతుల పొలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలు చెరువుల్లో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నా మైనర్ ఇరిగేషన్ అధికారులు సైతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు ఉనికిని కోల్పోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పల్లెల్లో టిప్పర్లు, ట్రాక్టర్లు అధిక లోడుతో వెళ్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


