హెల్త్ అండ్ వెల్త్ బాధితులకు న్యాయం చేస్తాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ‘హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్’ బాధితులకు న్యాయం చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో హెల్త్ అండ్ వెల్త్ సంస్థ చేతిలో మోసపోయిన దొర్నిపాడుకు చెందిన బాధితులతో కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో ఉద్యోగాలిస్తామని సుమారు 850 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 3.60 లక్షలు వసూలు చేసిందన్నారు. ఒక్కొక్కరు నెలకు అరగంట పని చేస్తే రూ.40 వేల జీతం ఇస్తామని చెప్పి నమ్మబలకడంతో బాధితులు ఇంట్లోని బంగారం, ఇళ్లు, ఆస్తులు తాకట్టు పెట్టి ఆ సంస్థ నిర్వాహకులకు డబ్బులు చెల్లించి మోసపోయారన్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే హెల్త్ అండ్ వెల్త్ సంస్థ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందన్నారు. అనంతరం కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఈనెల 14వ తేదీన అధికారికంగా ఎఫ్ఐఆర్ నమో దు చేశామన్నారు. బాధితులు సంబంధిత వివరాలు, సాక్ష్యాలు, బ్యాంక్ రసీదులు వంటి సమాచారాన్ని పోలీసు శాఖకు అందిస్తే, విచారణ మరింత సులభతరం అవుతుందన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, వేగంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ పాల్గొన్నారు.


