వడదెబ్బతో మహిళ మృతి

- - Sakshi

సంజామల(కోవెలకుంట్ల): సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన నారాయణమ్మ(63) బుధవారం వడదదెబ్బతో మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన నారాయణమ్మ మిర్చి కోత పనులకు వెళ్లింది. ఎండ తీవ్రత అధికం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. తోటి కూలీలు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందింది.

వివాహిత ఆత్మహత్య

పాణ్యం: భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తమ్మరాజుపల్లె గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ మధుసూదన్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రహిమాబీ కూతురు షేక్‌ రేష్మాబీ(36)ని తాండ్రపాడులో నివాసముంటున్న షాషావలికి ఇచ్చి గతంలో వివాహం చేశారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. షేక్‌ రేష్మాబీని కొంతకాలంగా భర్తతో పాటు అత్త నూర్‌బీ వేధిస్తుండడంతో ఇటీవల పుట్టినింటికి చేరుకుంది. అయినా వదలకుండా భర్త పదేపదే ఫోన్‌ చేసి తిట్టేవాడు. రెండు రోజుల క్రితం భర్త, అత్త తమ్మరాజుపల్లెకు వచ్చి కాపురానికి రావాలని కోరారు. నిరాకరించడంతో బూతులు తిట్టడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి రహిమాన్‌బీ ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సెబ్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌

కర్నూలు: ఆదోని డివిజన్‌ మొబైల్‌ పార్టీలో విధులు నిర్వహిస్తున్న ఓ సెబ్‌ ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ చేసినట్లు తెలిసింది. ఈనెల 19న కర్ణాటకలోని ఇటికెల గ్రామ సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీస్‌ నేమ్‌ప్లేట్‌తో ఉన్న ఏపీ 39 టీటీ 2557 నంబర్‌ కారులో 4 బాక్సుల కర్ణాటక మద్యం లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే డ్రైవర్‌పై కేసు నమోదైంది. పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసుతో సంబంధమున్న ఎస్‌ఐని సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Read latest Nandyala News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top