రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు.
15న పాఠశాలల
పునః ప్రారంభం
నల్లగొండ : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పునః ప్రారంభ తేదీని ప్రభుత్వం మార్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం జూన్ 15న పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే విద్యా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి.
పాఠ్యపుస్తకాల
రచయితగా మల్లేష్
నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సవంత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం, ఏపీలో ద్వితీయ సంవత్సరం జీవశాస్త్రం తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాల రచయితగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మోదాల మల్లేష్కు అవకాశం దక్కింది. గతంలో తెలుగు అకాడమీ నుంచి ప్రచురితమైన గ్రూప్–1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు (ఆంగ్లమం, తెలుగుమాధ్యమం) రచనలో ఆయన భాగస్వామి అయ్యారు. డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పుస్తక రచనలో కూడ సహ రచయితగా ఉన్నారు.
టీజీ–20 అనురాగ్
నల్లగొండ నైట్స్ జట్టు
ఫ 20 మంది క్రికెటర్లను వేలంలో
దక్కించుకున్న ఫ్రాంచైజీ
నల్లగొండ టూటౌన్ : యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) చేపట్టిన టీజీ–20 క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలం ఆదివారం ముగిసింది. హైదరాబాద్లో నిర్వహించిన వేలంలో ఫ్రాంచైజీ అనురాగ్ నల్లగొండ నైట్స్ భారీ ధర చెల్లించి క్రీడాకారులను దక్కించుకుంది. టీమ్కు అవసరమైన 20 మందిని వేలం ద్వారా దక్కించుకున్నారు. ఆటగాళ్లలో ఎండీ.అర్ఫాజ్అహ్మద్ (రూ. 11 లక్షలు), రాహుల్ బుద్ది (రూ.8 లక్షలు), చింతల రక్షణ్రెడ్డి (రూ.6 లక్షలు), పాట్కూరి నితీష్రెడ్డి (రూ.5.50 లక్షలు), నిశాంత్ సరను (రూ.5.50 లక్షలు), అనికేత్రెడ్డి (రూ.4.75 లక్షలు), ఎలగాని వరుణ్గౌడ్ (రూ.3.50 లక్షలు), ప్రణవ్ సూర్యదేవర (రూ.2.50 లక్షలు), ఇళ్యాన్ సతని (రూ.1 లక్ష) హర్షవర్ధన్సింగ్ (రూ.1 లక్ష), చిన్నుగారి రుత్విక్, డివేష్ సింగ్, జస్వంత్ మోతె, విక్రాంత్రెడ్డి, షేక్ సమీర్, షేక్ సోహెల్, బీరవోలు నాగసుధామ్స్రెడ్డి, శ్రీకాంత్, ఉర్వేష్ కక్కడ్ ఒకొక్కరికి రూ.75 వేల చొప్పున్న చెల్లించి దక్కించుకున్నారు.
ఆటోమిషన్ ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపాం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్నిగేట్లను సమర్థవంతంగా ఎత్తేందుకు వినియోగించే ఆటోమిషన్ ఆధునీకరణకు తయారు చేసిన అంచానాలను రాష్ట్రప్రభుత్వ పరిపాలన అనుమతి కోసం పంపినట్లు సాగర్డ్యాం ఇంజనీర్లు తెలిపారు. గతంలో ఆంధ్రా అధికారులు ధ్వంసం చేసిన పరికరాలను పునరుద్ధరించేందుకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.29.2 లక్షల ఖర్చుతో ఆటోమిషన్ పరికరాలకు మరమ్మతులు చేసి గేట్ల నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆధునాతన ఎస్సీఏడీఏ వెర్షన్ కోసం రూ.43.20 లక్షల అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పరిపాలన ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఆధునీకరించి.. 100శాతం రిమోట్ ఆపరేషన్తో పాటు మ్యానువల్ తనిఖీలతో గేట్లను ఎత్తి దింపనున్నట్లు పేర్కొన్నారు.


