మిర్యాలగూడ : ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, పెంచిన ఎరువుల ధరలు సాగును మరింత భారంగా మార్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలను రూ.300 నుంచి రూ.400 వరకు పెంచి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో డీఏపీ దొరకడం లేదని, జీలుగు, పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సరైన వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయకపోవడం వల్లే సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బడ్జెట్లో కొత్త పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తూ.. రైతుబంధు, రుణమాఫీ పథకాలను విస్మరించడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అన్నారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్నాయక్, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి


