సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వడగాల్పులతో మరింత వేడి..
జిల్లావ్యాప్తంగా అధిక ఎండలతో పాటు మధ్యాహ్నం వేళ వడగాల్పుల ప్రభావంతో వేడి రెట్టింపవుతోంది. ఇళ్లలో ఫ్యాన్ కింద ఉంటున్నా ఉక్కబోత, అధిక వే డితో జనం సతమతమవుతున్నా రు. ఇక ఎండలో పనిచేస్తున్న కా ర్మికులు, వ్యవసాయ కూ లీలు, వీధి వ్యాపారులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెలరోజులపాటు నిప్పులకుంపటే..
ఈ వేసవిలో మరో నెలరోజులపాటు ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండనున్నట్టు వాతావరణశాఖ అంచనావేసింది. ఈనెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగి నిప్పుల కుంపటిని తలపించనుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ ప్రభావం దినసరి కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు, చిరువ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. ఎండలో బయటకు వెళ్లే వారు దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మండలం గరిష్ట
ఉష్ణోగ్రత
వెల్దండ 42.9
కల్వకుర్తి 41.4
లింగాల 41.4
పెంట్లవెల్లి 41.0
ఊర్కొండ 40.7
పెద్దకొత్తపల్లి 40.6
కొల్లాపూర్ 40.2
బల్మూర్ 40.1
తిమ్మాజిపేట 39.9
ఉప్పునుంతల 39.7
నాగర్కర్నూల్ 39.7
బిజినేపల్లి 39.7
వంగూర్ 39.6
తాడూరు 39.5
వృద్ధులు, చిన్నారులు జాగ్రత్త..
వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులతో పాటు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యా హ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దు. దాహం లేకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి నీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
– డా.రాజేశ్గౌడ్, పిల్లల వైద్యనిపుణులు, నాగర్కర్నూల్
జిల్లాలో 42 డిగ్రీలకు పైగా
ఉష్ణోగ్రతలు
తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి
మధ్యాహ్నవేళ బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
ఇబ్బందులు పడుతున్న కూలీలు, వీధి వ్యాపారులు
మరో మూడు రోజుల్లో 43 డిగ్రీలకు మించనున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల్లో)..


