నాగర్కర్నూల్ క్రైం: బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ కేసులు లేకుండా వేగంగా విచారణ జరపాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, డయల్ 100, సీసీ కెమెరాల నిర్వహణ, ప్రజా ఫిర్యాదులపై స్పందన, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రీఫండ్, చోరీ కేసులు, మర్డర్, అనుమానాస్పద మృతి కేసుల్లో దర్యాప్తు పురోగతి మొదలైన అంశాలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు ఉన్నారు.


