అధికారులు ఎందుకు హాజరుకారు?
కందనూలు: ముఖ్యమైన సమావేశాలకు అధికారులు తరచూ గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్పర్సన్ శాంతాకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్.జే.ఆర్ ఫంక్షన్ హాల్లో జెడ్పీచైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ప్రభుత్వ విప్, అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మనూ చౌదరి హాజరయ్యారు. అతి ముఖ్యమైన ప్రజాసంబంధ శాఖలపై ముందుగా చర్చ చేపట్టారు. వ్యవసాయం, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, విద్యుత్, మెడికల్ ఆస్పత్రి, విద్య, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖలపై వాడీవేడిగా చర్చించారు.
● జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తమ కిందిస్థాయి అధికారులను కాకుండా జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ శాంత కుమారి తెలియజేశారు. సమావేశాలకు అన్ని శాఖల తరఫున అధికారులు హాజరయ్యేలా, జిల్లా అధికారులు చొరువ చూపాలన్నారు.
బిల్లులు ఎలా వసూలు చేస్తారు..
కరెంట్ సరఫరా లేకుండా బిల్లులు ఎలా వసూలు చేస్తారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు. దీంతో పదర మండలంలోని చిట్లగుంటపల్లిలోని ప్రశాంత్నగర్ కాలనీలో 40 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు అక్కడికి వెళ్లి సమస్య ఎక్కడ ఉందో చూడాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంకా ఎక్కడైన నల్లా కనెక్షన్లు, లైన్లు ఇవ్వని ప్రాంతాల్లో వెంటనే పనులు పూర్తిచేయాలని సూచించారు. సబ్స్టేషన్ల ఏర్పాటు చాలా ఆలస్యం జరుగుతుందని, ఓవర్ లోడ్ సమస్య లేకుండా చూడాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్, విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఏ సమస్య ఉన్న త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా బదులిచ్చారు. చెంచులు ప్రతి సంవత్సరం సలేశ్వరం జాతర 15 రోజులు ఘనంగా జరుపుకుంటారని, దానిని ఈసారి రెండు రోజులకు కుదించడం సరికాదన్నారు.
వైద్యసేవలో మార్పు లేదు..
జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు అయినప్పటికిని వైద్యసేవలో పెద్దగా మార్పు రాలేదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన వైద్య పోస్టులను సకాలంలో భర్తీ చేసే ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తున్నారని, జిల్లా వైద్య అధికారి సుధాకర్లాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజువారీ అవుట్ పేషెంట్ల సంఖ్య పెరగాలని, అప్పుడే ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లపై నమ్మకం పెరుగుతుందన్నారు. సబ్ సెంటర్ల మరమ్మతుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్కు సూచించారు. తెలకపల్లి ఎంపీపీ మధు, పెద్దకొత్తపల్లి జెడ్పీటీసీ గౌరమ్మ, వెల్దండ జెడ్పీటీసీ విజితా రెడ్డి, బల్మూర్ ఎంపీపీ అరుణ తమ మండల పరిధిలోని తాగునీరు, విద్యుత్ సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఆదనవు కలెక్టర్ మనూచౌదరి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ శాంతాకుమారి ఆగ్రహం
విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు –
ప్రభుత్వ విప్ గువ్వల బాల్రాజు
వైద్యశాఖ నిర్లక్ష్యంపై అధికారులను
నిలదీసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి