మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు.
రోడ్ల పనులతో తప్పని తిప్పలు
మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే పలు దారుల రోడ్ల నిర్మాణం పనులు చేస్తుండగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతుండడంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారంలో జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, జంపన్నవాగు నుంచి గద్దెలకు వచ్చే దారిలో నీడ చెట్ల నుంచి హరితహోటల్ దారిలో, ఆర్టీసీ బస్డాండ్ భక్తుల క్యూలైన్ దారిలో రోడ్ల విస్తర్ణం పనులు సాగుతున్నాయి. పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా జంపన్నవాగు నుంచి గద్దెల వద్దకు వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా మేడారం ఐలాండ్ వద్దకు భక్తుల వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా తాడ్వాయి మీదుగా మేడారానికి వచ్చిన భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారం ఐలాండ్ వరకు రోడ్డు నిర్మాణం పనులు నడుస్తుండడంతో వాహనాలు వెళ్లలేని పరిస్దితి ఏర్పడింది. హరితహోటల్ దారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా భక్తుల వాహనాలు వెళ్లేందుకు దారి లేకుండా పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. జంపన్నవాగు స్నానఘట్టాల రోడ్డుపై నుంచి రెడ్డిగూడెం ఊళ్లో నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్డాండ్ ప్రదేశాలకు వెళ్లారు. ఈ దారులు తెలియని భక్తులు జంపన్న వాగు వద్ద వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన అమ్మవార్ల దర్శనానికి గద్దెల వద్దకు తరలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న కొంతమంది భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రులు పొంగులెటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు మేడారం పర్యటనకు వచ్చిన సందర్భాల్లో పదేపదే అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినా వారి తీరు మారడం లేదు.
భారీగా తరలివచ్చిన భక్తజనం
వనదేవతలకు మొక్కుల చెల్లింపు
రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు
మేడారంలో భక్తుల కోలాహలం


