నేటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ములుగు రూరల్: జిల్లా అథ్లెటిక్స్ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆస్మిత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాకారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేటి నుంచి అండర్ 14, 16 బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2036 ఒలంపిక్స్లో దేశం తరఫున పాల్గొనేందుకు కిందిస్థాయి నుంచి బాలికల్లోని క్రీడానైపుణ్యాన్ని గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణులను రాష్ట్ర, జాతీయస్థాయిలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నతస్థాయిలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ములుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా జిల్లాలోని దివ్యాంగులందరికీ రేపటి నుంచి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివ్యాంగులకు రన్నింగ్, షాట్పుట్, చెస్, జవెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ జూనియర్స్ విభాగంలో 10 నుంచి 17 సంవత్సరాల వరకు, సీనియర్స్ విభాగంలో 18 నుంచి 54 ఏళ్ల వారికి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్తో పాటు ఆధార్కార్డుతో హాజరు కావాలని సూచించారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు.
వెంకటాపురం(కె): ఉపాధ్యాయులకు ప్రభుత్వం టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు పుణెం రమణయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులను టెట్ పరీక్ష మానసిక ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. బోధన నాణ్యత, అభ్యసన ప్రక్రియకు ఆటకంగా మారుతుందని వివరించారు. టెట్ మినహాయింపుపై యూనియన్ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై సంఘం నిరంతరం పోరాడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండా రంగారావు, వాంకుడోత్ రాంబాబు, నాయుడు, రాజశేఖర్, రాంబాబు, శిరీష, ఉషారాణి, సమ్మక్క, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట: ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ను చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలిసింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబు దర్శించుకున్నారు. గురువారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించారు.
నేటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
నేటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు


