నీరు నిల్వచేయలేక!
ట్రిబ్యునల్కు చేరిన సమస్య
నివేదిక ఇవ్వక..
ఏటూరునాగారం: జిల్లాలోని సమ్మక్క బ్యారేజ్ డీపీఆర్ రెండేళ్లుగా అధికారులు నివేదిక ఇవ్వడం లేదు. దీంతో బ్యారేజ్లో నీటిని నిల్వ చేయలేక ఇరిగేషన్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రిబ్యునల్కు రెండు రాష్ట్రాల పంచాయితీ చేరినా పరిష్కారం పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో తెలియక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ నీటి సామర్థ్యం అంతంతగానే మారింది. బ్యారేజ్పై డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఇచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు రెండేళ్లుగా నాన్చుతున్నారు. బ్యారేజ్ బ్యాక్ వాటర్తో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 32 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. ఆ భూమిని సమ్మక్క ప్రాజెక్టు కింద కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు గాను రెండేళ్ల క్రితం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. కానీ రిపోర్టు మాత్రం ఇవ్వడం లేదు.
సమ్మక్క బ్యారేజ్ కెపాసిటీ నీటి సామర్థ్యం 6.5 లక్షల క్యూసెక్కులు. దీనికి తగ్గట్టుగా బ్యారేజీలో నీటిని నిల్వ చేయాల్సి ఉంది. కానీ బ్యారేజ్కు ఉన్న 59 గేట్లు మూసివేసి నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 32 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. దీనిపై ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన ఇంజనీరింగ్ అధికారులు రిపోర్ట్ ఇవ్వాలని బాధ్యతలను అప్పగించింది. ఏడాది దాటినా ఇంత వరకు రిపోర్టు రాలేదు.
సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం దేవాదుల ఎత్తిపోతల పథకానికి భరోసాగా నిలిచేందుకు నిర్మించారు. కాని సమ్మక్క బ్యారేజ్కు ఉన్న 59 గేట్లను మూసివేసినప్పటికీ 6.5 క్యూసెక్కుల నీటిని నిల్వ చేసుకోలేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన నీటిని గోదావరి దిగువకు వదిలేసి ఉన్న నీటినే పట్టుకొని దేవాదులకు మళ్లిస్తున్నారు. అయితే సామర్థ్యానికి తగ్గట్టుగా నిల్వ చేయకపోవడంతో దేవాదులలోని మోటార్లు నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకుండా పోయింది. ఏదిఏమైనప్పటికీ 32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కుంచుకునే వరకు బ్యారేజ్ నీటి సామర్ధ్యం అంతంతేగా ఉండే పరిస్థితి ఉంది.
దీంతో ఈ నెల 9న హైదరాబాద్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశమై భూమి విషయాన్ని తేల్చాలని ఆదేశించారు. దీనిపై చర్చించేందుకు ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని గోదావరి జలాల ట్రిబ్యునల్కు రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రిత్వశాఖ, ఇరిగేషన్ అధికారులు సమస్యను వివరించారు. కానీ ఎలాంటి పరిష్కారం కాలేదు. ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరైన పరిష్కారం చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడం వంటి అంశాలతో సమ్మక్క బ్యారేజ్ నీటి సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల నుంచి ఈ సమస్య జఠిలం కావడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
నీరు నిల్వచేయలేక!
నీరు నిల్వచేయలేక!


