పెరిగిన మెస్చార్జీలు
వంట కార్మికులకు ఊరట
వేతనం రూ.10 వేలు అందించాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెస్చార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విద్యార్థులకు చాలీచాలని వంట సరుకులను తీసుకొస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి జూలై నుంచి అమలు చేస్తుంది. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నప్పటికీ పెగిరిన మెస్ చార్జీలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
జిల్లాలో 655 మంది కార్మికులు
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 655 మంది వంట కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 416 పాఠశాలల్లో 15,816 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ధ్వారా బియ్యం పంపిణీ చేస్తుంది. కూరగాయలు, పప్పులు, నూనె, కారం, ఉప్పు, కోడి గుడ్లు, వంట గ్యాస్ను కార్మికులు కొనుగోలు చేసి నెల వారీగా బిల్లు పెట్టుకోవాల్సి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో విద్యార్థులుకు అందించే భో జనం నాణ్యత లోపించింది. దీనికితోడు నెలవారీగా చెల్లించాల్సిన బిల్లు రాకపోవడంతో భోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాని కార్మికులు కోరుతున్నారు.
విద్యార్థుల మెనూ..
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలి. వారంలో మూడు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం కోడిగుడ్డు అందించాలి. రోజు వారీగా మిక్స్డ్ కూరగాయాలు, చారు, ఆకు కూరలు, పప్పు, రాగిజావ అందించాలి. గురువారం వెజిటేబుల్ బిర్యానీ అందించాలి.
జిల్లాలో ప్రైమరీ పాఠశాలలు 332 ఉండగా ఇందులో విద్యార్థులకు గతంలో మెస్ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.6.19 అందించగా పెరిగిన ప్రకారం రూ.6.78 పైసలు అందిస్తారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 43 ఉండగా గతంలో రూ.9.29 పైసలు చెల్లించారు. ప్రస్తుతం 10.17 పైసలు అందిస్తున్నారు. హై స్కూల్స్ 41 ఉండగా అందులో గతంలో రూ.10.67 అందించగా ప్రస్తుతం రూ.11.17 పైసలు అందిస్తున్నారు.
జిల్లాలో 416 పాఠశాలలు
15,816 మంది విద్యార్థులు
నెలల తరబడి బిల్లుల పెండింగ్
మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలు నామమాత్ర ఉపశమనమే. మధ్యాహ్న భోజన పథకంలో బియ్యంతోపాటు, గ్యాస్, నిత్యావసర సరుకులు, కోడి గుడ్లు ప్రభుత్వం పంపిణీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వంట కార్మికులకు వేతనం నెలకు రూ.10 వేలు అందించాలి. కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
– జంపాల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
పెరిగిన మెస్చార్జీలు


