సలార్కి ఖరార్?
ప్రభాస్ సినిమా అంటే హాట్ టాపిక్. సినిమా ప్రకటించగానే అందులో నటించబోయే నాయిక ఎవరు? టైటిల్ ఏంటి? అనే చర్చలు మొదలవుతాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకి ‘సలార్’ టైటిల్ ఖరారు చేసినట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. టైటిల్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే చర్చ జరుగుతోంది. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ చిత్రంలో ఒకరు కాదు.. ముగ్గురు కథానాయికలు ఉంటారని తెలిసింది.
ఈ పాత్రలకు కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, దిశా పటానీ పేర్లను పరిశీలిస్తున్నారట. ఆల్రెడీ ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయమైన కియారా ఆ తర్వాత ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇక ‘లోఫర్’ తర్వాత దిశా పటానీ తెలుగు సినిమాలు చేయలేదు. శ్రద్ధా, కియారా, దిశా. మరి ఈ ముగ్గురినే ‘సలార్’కి ఖరారు చేస్తారా? లేక వేరే కథానాయికలు నటిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ చిత్రం షూటింగ్ని జనవరిలో ఆరంభించాలని అనుకుంటున్నారు.