సలార్ అప్డేట్.. ముహూర్తం ఖరారు
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు వీపరీతమైన స్పందన లభించింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా గురువారం ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. చదవండి: ప్రభాస్కు విలన్ అతడేనా!
జనవరి 15న(రేపు) ఉదయం 11 గంటలకు సలార్ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. దర్శకుడు, రాజమౌళి, కన్నడ నటుడు యశ్క కూడా విచ్చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్కు జోడిగా బాలీవుడ్ భామ దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో విలన్ పాత్రలో కూడా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్గా నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఆది పురుష్’ చిత్రీకరణ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. చదవండి: ప్రభాస్కు ముహూర్తం కుదిరింది