థియేటర్స్ విషయంలో మాట మార్చిన సీఎం
థియేటర్స్లో వంద శాతం సీటింగ్ అనుమతిపై కర్ణాటక సర్కార్ ముందు వెనుకలాడుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో థియేటర్స్లో సీటింగ్ సామర్థ్యాన్ని యాభై శాతానికి పరిమితం చేస్తూ, శుక్రవారం నాడు కర్ణాటక ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే, కన్నడ స్టార్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సర్కార్ శనివారం నాడు మళ్ళీ మాట మార్చింది. ఈ నెల 7వ తేదీ దాకా పూర్తి కెపాసిటీతోనే సినిమాల ప్రదర్శనకు ఓకే చెప్పేసింది.
కర్ణాటక సర్కార్ మాట మార్చడానికి ముందు ‘‘వియ్ వాంట్ హండ్రెండ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ’’ అని సోషల్ మీడియా వేదికగా కన్నడ స్టార్స్ కోరారు. ‘‘కోవిడ్ పరిస్థితుల నుంచి చిత్రపరిశ్రమ పూర్తిగా కోలుకోలేదు. ఈ సమయంలో థియేటర్స్లో సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించడం కరెక్ట్ కాదు’’ అని ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్తో పాటు పలువురు కన్నడ సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
మరోపక్క, సుదీప్ లాంటి వారు మాత్రం కోవిడ్ నేపథ్యంలో 50 శాతం థియేటర్ కెపాసిటీకి తగ్గించడం కొత్త రిలీజ్ సినిమాలు వేటికైనా ఇబ్బందే అంటూనే, ప్రభుత్వ నిబంధనల్ని గౌరవాల్సిందే అనడం విశేషం. నిజానికి, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన భారీ చిత్రం ‘యువరత్న’ శుక్రవారమే రిలీజై, థియేటర్స్లో ఉంది. ఇలా హఠాత్తుగా సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించడం పట్ల పునీత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, శనివారం నాడు పునీత్ సైతం స్వయంగా వెళ్ళి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. ఆ సమావేశం తరువాత ఈ నెల 7 వరకూ వంద శాతం సీటింగ్కి అనుమతిస్తూ, కర్ణాటక సర్కార్ కొత్త జీవో విడుదల చేయడం గమనార్హం.