ట్రోలింగ్ను పట్టించుకోవడం మానేశా: హీరోయిన్
జనాలకు సినిమాలంటే పిచ్చి. అందులో ఉండే క్యారెక్టర్ల కన్నా ఆ పాత్రల్లో నటించిన నటీనటులనే ప్రాణంగా ప్రేమిస్తారు. వారిని ఫేవరెట్గా భావించిన మరుక్షణం నుంచి ఫాలో అవుతూనే ఉంటారు. ఇది కొన్నిసార్లు సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారుతుంటుంది. పైగా వీళ్ల ఇష్టాయిష్టాలను ప్రేక్షకులు పట్టించుకోరు. తమకు నచ్చినట్లుగానే ఉండాలంటారు. తమకు నచ్చని డ్రెస్సులు వేసినా, కాస్త నోరుజారి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఇక అంతే సంగతులు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దారుణమైన ట్రోలింగ్కు దిగుతారు. నోటికొచ్చిన మాటలు అంటారు. దీనివల్ల ఎదుటివారి మనోభావాలు నొచ్చుకుంటాయన్న ఇంగితం లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారు. ఇటీవలి కాలంలో ఈ ట్రోలింగ్ బెడద మరీ ఎక్కువైంది. చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. (చదవండి: వెంటిలేటర్పై నటుడు.. దాతల కోసం ఎదురుచూపు)
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా ఈ ట్రోలింగ్ బాధితురాలే. ముఖ్యంగా తను ధరించే దుస్తుల మీద ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నారు, ఎదుర్కుంటూనే ఉన్నారు కూడా! తాజాగా ఆమె దీనిపై స్పందిస్తూ తనకు ఏది సౌకర్యంగా అనిపిస్తే వాటినే ధరిస్తానని చెప్పుకొచ్చారు. హీరోయిన్ కరీనా కపూర్ షో 'వాట్ వుమెన్ వాంట్' షోలో పాల్గొన్న అనన్య.. 'కెరీర్ ప్రారంభంలో అందరికీ సంతోషాన్నిచ్చే దుస్తులు ధరించాను. కానీ ఇప్పుడు నాకు ఆనందాన్నిచ్చే డ్రెస్సులే వేసుకుంటున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకున్న ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అందుకే దాన్ని పట్టించుకోవడం మానేశా. నాకు నచ్చిన బట్టలు వేసుకున్నానా, ఫొటోలు బాగొస్తున్నాయా? సంతోషంగా ఉన్నానా? అదే నాకు అవసరం' అంటున్నారు. ఈ ముద్దుగుమ్మ విజయ దేవరకొండ 'ఫైటర్' చిత్రంతో టాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు. (చదవండి: ఆలియాభట్ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్)