2 వారాలుగా ఒక్క మనిషీ కనిపించట్లేదు
కరోనా బారిన పడ్డ బిగ్బీ అమితాబ్ బచ్చన్ రెండు వారాలుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన అనుభవాలను, ఒంటరిగా పరిశీలిస్తూ వచ్చిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. ఇన్ని రోజులుగా ఒక్క మనిషిని కూడా చూడకుండా ఉండటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. "రాత్రిపూట ఒంటరిగా ఉన్న నేను గదిలో చలికి వణికిపోయాను. అప్పుడే నిద్ర కోసం కళ్లు మూసుకుంటూ పాటలు పాడాను. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు" అని రాసుకొచ్చారు. (అమితాబ్కు కరోనా.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్)
కోవిడ్తో బాధపడే రోగి మానసిక ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ.. "ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉన్న రోగిని చూసేందుకు ఏ ఒక్క మనిషీ రాడు. డాక్టర్లు, నర్సులు వచ్చినా వారు పీపీఈ కిట్లు ధరించే ఉంటారు, వారి ముఖ కవలికలు కనిపించవు, అసలు వారెవరో కూడా తెలీదు. వాళ్లను చూస్తే రోబోలలానే అనిపిస్తుంది. మనకు ఏం కావాలో, అది ఇచ్చేసి వెళ్లిపోతారు. ఎక్కువ సేపు ఉంటే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న భయం వారినీ వెంటాడుతుంది. పైగా చికిత్స అందిస్తూ పర్యవేక్షించే వైద్యుడు రోగి దగ్గరకు వచ్చి వెన్నుతట్టి ధైర్యమివ్వరు. వీడియో కాల్లోనే మాట్లాడతారు. అయితే ఇది ప్రస్తుత పరిస్థితిలో మాత్రమే ఉత్తమమైనది" అని పేర్కొన్నారు. (ఆలోచనల్ని అదుపులో ఉంచండి)