
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సాంకేతిక సమస్యలు, రైతులు ముందుకు రాకపోవడంతో ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 24 శాతమే పూర్తి కావడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆధార్కార్డు తరహా కార్డు అందించడంతో పాటు పక్కా వివరాలు అందుబాటులో ఉంటాయని భావించింది. అయితే జిల్లాలో ఆశించిన మేర ప్రక్రియ ముందుకుసాగడం లేదు. జిల్లాలో సాధారణ పట్టాలు కలిగిన రైతులు 2.96 లక్షలకు పైగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 24 శాతమే నమోదు చేసుకున్నారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు, ప్రత్యేక యాప్లో కనిపించకపోవడం, రైతులకు రెండు, మూడు గ్రామాల్లో భూములుంటే ఒక చోట నమోదు చేశాక.. మిగితావి అయినట్లుగా చూపుతుండటం, వివరాలు కనిపించకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
గ్రామాల్లోకి వెళ్తున్న అధికారులు
ప్రస్తుతం రైతుల వివరాల నమోదుకు ఏఈఓలకు అవకాశం కల్పించారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా నమోదు కార్యక్ర మాన్ని చేపడుతున్నారు. అయితే వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులకు వెళ్తున్నారు. దీంతో ఎక్కువ మంది నమోదు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆధార్ సంఖ్యతో అనుసంధానం ఉన్న సెల్ఫోన్తో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరో వైపు ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసే సమయంలో మూడుసార్లు ఓటీపీ వస్తుంది. అయితే రెండోసారి ఓటీపీ సరిగా రావడం లేదు. అంతటా ఒకేసారి నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో నమోదులో జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులుచెబుతున్నారు.
అనేక ప్రయోజనాలు
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి, పీఎం సించాయి యోజన, పీఎం కిసాన్ మాన్–ధన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ఉద్యానశాఖకు 60 శాతం సబ్సిడీ.. తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు పొందాలంటే విశిష్ట గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
జిల్లాలో ఇప్పటివరకు 24 శాతమే పూర్తి వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు ముందుకు రాని రైతులు తప్పనిసరి అంటున్న అధికారులు
క్యాంపులు ఏర్పాటు చేశాం
ఫార్మర్ రిజిస్ట్రీ కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైతుల వివరాల నమోదుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు రైతుల ఆధార్కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం, లింకు ఉన్న ఫోన్ అందుబాటులో లేకపోవడం, ఓటీపీల కోసం గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ అందకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగానే నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది.
– విన్సెంట్ వినయ్కుమార్, డీఏఓ

ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!