
తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలన్నారు. అవసరమైన చోట అదనపు పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
టైలరింగ్లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9490129839 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
జాబ్ మేళాతో
నిరుద్యోగులకు మేలు
నర్సాపూర్: నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. నిరుద్యోగ యువత నుంచి స్పందన బాగున్నందున అవసరాన్ని బట్టి మళ్లీ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు రిజ్వాన్, మల్లేష్, మహేష్రెడ్డి, సురేష్, సాగర్, చిన్న అంజిగౌడ్, నగేష్, రషీద్, ఎన్ఎస్యూఐ జిల్లా అద్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
గోశాలకు గ్రాసం అందజేత
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి గోశాలకు పలువురు దాతలు అదివారం పశుగ్రాసం అందజేశారు. గోశాలలో గ్రాసం కొరతతో ఆవులు డొక్కలు చిక్కి.. బొక్కలు తేలాయని శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందుకు గాను పలువురు దాతులు ముందుకు వచ్చారు. నర్సాపూర్కు చెందిన నరేష్యాదవ్, ఓంకార్ యాదవ్ కుటుంబ సభ్యులు ఎండు, పచ్చి పశుగ్రాసం గోశాల నిర్వాహకులకు అందజేశారు.
ముత్యాలమ్మకుబండ్ల ఊరేగింపు
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధిలో గ్రామ దేవతలైన గట్టమ్మ, ముత్యాలమ్మ ఆలయాల చుట్టూ ఆదివారం భక్తులు బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బండ్లు, బోనాల ఊరేగింపు నిర్వహించడం అనవాయితీ. నవాబుపేట, ఫత్తేనగర్, కోలిగడ్డ, గోల్కోండ వీధి, దాయర.. తదితర వీధులకు చెందిన భక్తులు బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు.

తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి

తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి