పీహెచ్సీ భవన నిర్మాణ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
మనోహరాబాద్(తూప్రాన్): ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్యం అందుతుందని, ప్రభుత్వ ఆస్పత్రులను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పీహెచ్సీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కాగా పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీహెచ్సీ కేంద్రాన్ని పరిశీలించారు. పీహెచ్సీ కేంద్రంలో మహిళలకు ప్రతీ మంగళవారం వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నారా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రికార్డు చేయాలని, ప్రతీ గ్రామం నుంచి మహిళలను పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని మహిళా సమైఖ్య సంఘం సభ్యులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ చందునాయక్, ఆర్డీఓ శ్యాంప్రకాశ్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ యాదగిరిరెడ్డి, సర్పంచ్ మహిపాల్రెడ్డి, ఏపీఎం పెంటాగౌడ్, డాక్టర్ జ్యోత్స్నదేవి, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులున్నారు.
భగవద్గీత సార్వజనీన గ్రంథం
రామాయంపేట(మెదక్): హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం పట్టణంలో మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు, పలు పీఠాలకు చెందిన స్వామీజీలు హాజరయ్యారు. దీంతో పట్టణమంతా కాషాయవర్ణంకాగా మారింది. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా 108 దంపతులు యజ్ఞం నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మైకులు ఏర్పాటు చేయడంతో ఇళ్లలో ఉన్నవారు సైతం పూజా కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా వినితరించారు. భగవద్గీఽత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, గీతాగాన ప్రవచన ప్రచారకర్త గంగాధర శాస్త్రి మాట్లాడుతూ ప్రజలు మంచి మార్గంలో నడవాలన్నారు. ఎవరైతే లోక కల్యాణంకోసం ఆలోచిస్తారో, వారు లోకం ఉన్నంతకాలం ప్రజల మనసులో బతికే ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని, ఇది సార్వజనీన గ్రంథమని పేర్కొన్నారు. ధర్మమంటే ఏమిటో మనం ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి మాట్లాడుతూ పరమాత్ముడు సమస్త ప్రపంచానికి ఆదర్శభూతుడన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బిచ్కుంద మఠం పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి, వీహెచ్పీ ధర్మాచార్య కేంద్రియ మండలి స్వామీజీ సంగ్రామ్ మహారాజ్, చీకోడ్ స్వామీజీ స్వామి సమర్ధ మహరాజ్, నాచారం పీఠాధిపతి మధుసూదనానంద స్వామి, కామారెడ్డికి చెందిన కృష్ణానందస్వామి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాపు యాదగిరి, వీహెచ్పీ జిల్లా సంఘటనా కార్యదర్శి పుట్టి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
గంగాధర శాస్త్రి
రామాయంపేటలో
హనుమాన్ చాలీసా పారాయణం
కాషాయవర్ణమైన రామాయంపేట