ప్రజావాణికి 59 అర్జీలు
నిర్దేశించిన లక్ష్యాలు
పూర్తి చేయాలి
ఆర్థిక సంవత్సరం ముగింపునకు గడువు మూడు రోజులే ఉన్నందున నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలకు వెంటనే బ్యాంకు లింకేజీ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య మహిళ, కంటి వెలుగు శిబిరాలను ఎక్కువ సంఖ్యలో వినియోగించుకునేలా పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. నెలాఖరు వరకు సీఎంఆర్ రైస్ ఎఫ్సీఐకి అందించేలా చూడాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు వెంకట శైలేష్, సాయిబాబ, రాధాకిషన్, కేశురాం, జెంలా నాయక్, లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్రావు, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి 59 అర్జీలు రాగా కలెక్టర్ రాజర్షిషా స్వీకరించారు. ప్రధానంగా భూసమస్యలు, ధరణి, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి అధికంగా వచ్చాయి. వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
భూమి కబ్జా చేస్తున్నారు
చేగుంట మండలంలోని పట్టా భూమిని రాంపూర్ సర్పంచ్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ మాసుల శ్రీనివాస్ కబ్జాకు పాల్పడుతున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా వారికే వత్తాసు పలుకుతున్నారు. – కుర్మ నాగమల్లయ్య, చేగుంట
పింఛన్ ఆగిపోయింది
వృద్ధ దివ్యాంగురాలినైన నాకు గత రెండేళ్లుగా పింఛన్ రావడం లేదు. దీంతో పడరాని పాట్లు పడుతున్నా. పింఛన్ ఇప్పించి ఆదుకోండి.
– గుండు లక్ష్మి, చిన్నశంకరంపేట
పట్టా పుస్తకం ఇస్తలేరు
60 ఏళ్లుగా కాస్తులో ఉండి పంట పండించుకుంటున్నాం. ఇటీవల ఫారెస్ట్ అధికారులు కొంత భూమి లాగేసుకున్నారు. మిగితా భూమికి పట్టా వచ్చేలా చూడండి.
– చిన్నదుర్గయ్య,
మహ్మద్నగర్, నర్సాపూర్
సిబ్బందిపై చర్యలు తీసుకోండి
తూప్రాన్లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల హాస్టల్లో ప్రిన్సిపాల్, వార్డెన్, టీచర్ల నిర్లక్ష్యంతో ఎనిమిదో తరగతి విద్యార్థి చనిపోయింది. వారిపై తగిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయండి.
– ప్రవీణ్,
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు
స్వీకరించిన కలెక్టర్ రాజర్షిషా