ప్రధాని మోదీని గద్దె దించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కరాములు
సదాశివపేట(సంగారెడ్డి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలని, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కారాములు పిలుపునిచ్చారు. సీపీఎం నిర్వహిస్తున్న జన చైతన్యయాత్ర ఆదివారం సదాశివపేట పట్టణానికి చేరుకున్న సందర్భంగా బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంటే అదాని, అంబాని సొత్తుగా మార్చేశారని, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాగర్, రమణ, జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు రాజయ్య, సాయిలు, మల్లేశం, రామచందర్, రమేశ్గౌడ్, మల్లేశం, ఎండీ ఖయ్యుం, అశ్వక్, శ్రీనివాస్, యాదవరెడ్డి, ఏశోబు తదితరులు పాల్గొన్నారు.