‘ఆరోగ్య మహిళ’లో 953 పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఆరోగ్య మహిళా కింద జిల్లాలో ఇప్పటివరకు 953 మందికి వైద్య పరీక్షలు చేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పోడుభూములు, హరితహారం, తదితర కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు రుసుం వసూలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారుల వివరాలను మూడు రోజుల్లో ఆన్లైన్లో పొందుపరుస్తామని చెప్పారు. పోడు భూములకు సంబంధించి తిరస్కరించిన వాటిపై స్పీకింగ్ ఆర్డర్స్ నివేదిక రూపొందిస్తున్నామని వివరించారు. నర్సాపూర్ అర్బన్ పార్కు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, డీసీహెచ్ చంద్రశేఖర్, డీపీఓ సాయిబాబా, డీఎఫ్ఓ రవిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.