బెల్లంపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, కొనుగోళ్లు ఆలస్యం చేయొద్దని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు మరింత ముమ్మరం చేయాలని సూచించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కాగా, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్ సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి సందర్శించారు.
సీఎంఆర్ లక్ష్యాలను చేరుకోవాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేస్తూ సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేసేలా రైస్మిల్లుల యజమానులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం హాజీపూర్ మండలం రాపల్లిలోని రాజరాజేశ్వర రైస్మిల్లును సందర్శించారు. రాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన సర్వే సమావేశంలో మాట్లాడారు. కర్ణమామిడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిష్పాండ్ పనులను పరిశీలించారు. సర్పంచ్ భూమయ్య, తహసీల్దార్ పుష్పలత పాల్గొన్నారు.


