
జొన్నలేప తిని మూడు లేగదూడలు మృతి
దిలావర్పూర్: మండలంలోని మాడేగం గ్రామశివారు పంట చేలలో మూడు లేగదూడలు జొన్నలేప తిని మృతిచెందాయి. బాధిత రైతు పులిండ్ల విజయ్, స్థానికులు తెలిపిన వివరాలు.. ప్రతీరోజులాగా లేగదూడలు సోమవారం మేత మేయడానికి వెళ్లాయి. గ్రామశివారులోని పంట చేలలో జొన్నలేప తిని నోటినుంచి తెల్లగా బురుసు వచ్చింది. రైతులు గమనించి వెంటనే వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ విజయ్కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని చికిత్స అందిస్తుండగానే మృతిచెందాయి. ఒక్కో లేగదూడ రూ.30 వేలుపైగా ఉంటుందని బాధిత రైతు తెలిపాడు
ట్యాంక్ ఎక్కితేనే..సిగ్నల్
కడెం: 4జీ, 5జీ టెక్నాలజీ ఎంతో ముందుకెళ్తున్నా నేటికి మొబైల్ నెట్వర్క్ లేని గ్రామాలు ఉన్నాయి. మండలంలోని మారుమూల ఇస్లాంపూర్కు నెట్ వ ర్క్ లేక స్థానికులు సోమవారం ఇలా వాటర్ ట్యాంక్లు, చెట్లెక్కి సెల్ఫోన్ను వినియోగిస్తున్నారు.
జూన్ 3 నుంచి
టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో వారు చదువుతున్న పాఠశాల పదోతరగతి స్కూల్కోడ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రుసుము 1 నుంచి 3 సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులుంటే రూ.125 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వరకు చెల్లించవచ్చని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేకాడుతూ ఐదుగురి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని లారీ అసోసియేషన్ ప్రాంతంలో పేకాడుతున్న ఐదుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలి పారు. వారి వద్ద నుంచి రూ.8800 నగదుతోపాటు పేక ముక్కలు, నాలుగు ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన వివాహిత సువర్ణ అదృశ్యమైంది. గతనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టూపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. భర్త శంకర్ సోమవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు.
క్షయరహిత సమాజం కోసం కృషిచేయాలి
భీమిని: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. భీమిని పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఏపీఎఫ్ టీబీ యాక్టివ్ కేసు నిర్దారణ క్యాంప్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఏ వయస్సు వారికై నా క్షయ లక్షణాలు ఉన్నట్లయితే గ్రామాల్లో ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. అంతకుముందు 35 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇన్చార్జి వైద్యుడు అనిల్కుమార్, సీఎచ్వో జలపతి, హెల్త్ ఆసిస్టెంట్ ఉమాశంకర్, ఎల్టీ చెన్నకేశవ, ఏసీఎఫ్ వ్యాన్ టెక్నిషియన్ శ్రీకాంత్, రవికుమార్ పాల్గొన్నారు.