● ప్రైవేటు డెయిరీలో రూ.లక్షలు పెట్టుబడి ● కట్టిన డబ్బులు కోల్పోతామేమోనని ఆందోళన ● స్వయం ఉపాధి పొందాలనుకున్నవారికి నిరాశే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక ఆఫర్లతో పాడి రైతులను ఆకర్శించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో రైతులు ఆగమాగం అవుతున్నారు. తమకు గేదెలు ఇవ్వకపోగా కట్టిన డబ్బులు తిరిగి తీసుకునేందుకు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది జూలై నుంచే జిల్లాలో భారీ స్థాయిలో డెయిరీ కంపెనీ నెలకొల్పుతామని ఆశలు చూపడంతో అనేకమంది నమ్మారు. ఇందులో కొందరు డబ్బులు చెల్లించారు. వీరిలో ఒకరిద్దరికి గేదెలు ఇవ్వగా.. ఎక్కువ మందికి ఇంకా పాడిపశువులు అందాల్సి ఉంది. నెలల తరబడి వేచి చూస్తున్న పాల ప్లాంటు ఏర్పాటు కాకపోవడం, అటు గేదెలు కూడా ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో చివరిగా పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా జరుగుతున్న వివాదాలతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పెట్టుబడి, రిజిస్ట్రేషన్, బీమా పేరుతో వసూలు చేసిన సొమ్ము రైతులు కోల్పోయినట్లుగా అవుతోంది.