ముగ్గురిని బలిగొన్న రోడ్డు ప్రమాదం
భీమ్గల్: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన వడ్ల రాజేశ్వర్, ఆయన చెల్లెలు గోవింద్ పేట్కు చెందిన రమ కుటుంబ సభ్యులు ఏడుగురు భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ ఎల్లమ్మ ఆలయానికి దైవ దర్శనం కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో కారులో వెళ్తుండగా భీమ్గల్ సబ్స్టేషన్ వద్ద జేసీబీని ట్రాలీపై తెస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్తో పాటు ట్రాలీపై ఉన్న జేసీబీ కారుపై పడింది. కారులో ఉన్న వడ్ల రాజేశ్వర్, ఆయన భార్య జ్యోతి, చెల్లి రమ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గంట పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలతో పాటు క్షతగాత్రులను బయటకు తీసేందుకు మూడు జేసీబీలను తెప్పించారు. జేసీబీల సహాయంతో కారులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరిని 108లో ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు రమ భర్త రాజేశ్వర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు
జేసీబీని తెస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్న కారు.. భీమ్గల్ వద్ద ఘటన
కారుపై పడ్డ జేసీబీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
మృతుల్లో భార్యాభర్తలు, సోదరి.. మరో నలుగురికి గాయాలు