క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పాలమూరు: మహబూబ్నగర్ను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనరల్ ఆస్పత్రి దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. క్షయ వ్యాధికి మందులు ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. డీఎంహెచ్ఓ కృష్ణ, సూపరింటెండెంట్ రామకిషన్ మాట్లాడుతూ క్షయవ్యాధి సూక్ష్మక్రిముల ద్వారా సంక్రమిస్తోందని, రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు సన్నని తుంపర్ల ద్వారా గాలిలోకి వ్యాపిస్తాయన్నారు. వీటిని ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. క్షయవ్యాధి మొదటగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందన్నారు. ఇది దీర్ఘకాలికంగా మందులు వాడే వ్యాధి కావడంతో నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, ఆర్ఎంఓ సిరాజుద్దీన్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి రఫీక్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.