ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
న్యూస్రీల్
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
గ్రేటర్ మహానగరం జలదిగ్బంధమైన వేళ.. మేమున్నామంటూ కదిలారు పోలీసులు, అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది. జల విలయాన్ని ఛేదిస్తూ వేలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సేవలందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బల్దియా కార్మికులు అయితే ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించారు. దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు దాతలు. మానవత్వంతో కదిలివచ్చిన వీరందరి ‘సేవలకు సలాం’ పలుకుతూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
– వరంగల్ అర్బన్/వరంగల్క్రైం/హనుమకొండ/కాజీపేట అర్బన్
వరంగల్ నగరంలో..
ఇటీవల కురిసిన వర్షానికి న్యూరాయపుర
మొత్తం మునిగిపోయింది. కాలనీలోని ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీళ్లు. సమాచారం అందుకున్న హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని స్ట్రెచర్పై పడుకోబెట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు.
అనంతరం ఎంజీఎంకు తరలించారు.
తనను కాపాడిన పోలీసులకు బాధితుడు
కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ ఫొటో చూడండి..
హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి
చెందిన అలేఖ్య గురువారం రాత్రి
అమెరికాకు వెళ్లాల్సి ఉంది. బుధవారం కురిసిన
వర్షానికి ఆమె ఇంటి చుట్టూ వరద. బయటికి
వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అలేఖ్యతోపాటు కుటుంబ సభ్యులకు లైఫ్ జాకెట్లు ధరింపజేసి రోప్ సాయంతో ఇంటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె
అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్
బయలుదేరి వెళ్లింది.
● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బల్దియా డీఆర్ఎఫ్
● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు
● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు
● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు
ప్రకృతి విపత్తుల సమయంలో గ్రేటర్ వరంగల్ మహా నగరాన్ని రక్షించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) మేమున్నామంటోంది. అత్యవసర సమయాల్లో మెరుపు వేగంతో రంగంలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తోంది. తాజా గా మోంథా తుపాను కారణంగా వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. ఈనేపథ్యంలో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం హైదరాబాద్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్, టీజీఎఫ్డీకి సంబంధించిన సుమారు వంద మంది రక్షకులు సేవలందించారు. వరదలో చిక్కుకున్న సుమారు 400 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి శెభాష్ అనిపించుకున్నారు. వరంగల్ నగరంలోని 45 వరద ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఆస్తి, ప్రాణ నష్టం, రవాణా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించి అందరి మన్ననలు పొందాయి.
పోలీసుల సేవాభావం..
పలు కాలనీల్లో వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ భవన్లో ఓ వివాహ వేడుక కోసం వచ్చిన సుమారు 150 మంది వరదలో చిక్కుకున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. కాపువాడ, గోకుల్నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాల్పూర్ భగత్సింగ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఒకదశలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ నేరుగా రంగంలోకి దిగి ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
విద్యార్థినులకు ఆపన్నహస్తం..
రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.
వరద పోటెత్తినా..
విద్యుత్ పునరుద్ధరణ
వర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
సల్లగా బతకమని ఆశీర్వదించింది..
సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది.
– వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్
గర్భిణిని ఒడ్డుకు చేర్చాం..
28వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో గర్భిణి వరదల్లో చిక్కుకుందని తెలియడంతో డీఎఫ్ఓ శంకర్ లింగం ఆదేశాలతో ముందుకు సాగాం. అదే సమయంలో ఏసీపీ శుభం ప్రకాశ్, మట్టెవాడ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో బయటకు తీసుకొచ్చి ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చాం
– సీహెచ్.అశోక్, డీఆర్ఎఫ్
అటు ట్రాఫిక్, ఇటు రెస్క్యూ..
వర్షం కురుస్తున్నంతసేపు సమస్య తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తక్షణ సేవలందించాం. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నాం. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాం.
– పునాటి నరసింహారావు,
ఏసీపీ, హనుమకొండ
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..


