
8 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ఖిలా వరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.7 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో డ్రగ్ కంట్రోల్ బృందం సీఐ సతీశ్, ఎస్సై పూర్ణచందర్, ఆర్పీఎఫ్ ఏఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మహారాష్ట్ర డైసర్కు చెందిన ఎండి. అష్రఫ్ షేక్, డోంగ్రి శాంతినగర్కు చెందిన రహీం బాబన్ పటేల్, ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన రాజు ఠాకూర్, మహారాష్ట్ర రత్నగిరి దైసార్కు చెందిన ప్రవీణ్ శ్యామ్ తవుడే అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో 8.7 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
నలుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన
వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్