హంద్రీ నది నుంచి జేసీబీతో ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్న దృశ్యం
కోడుమూరు రూరల్/నందవరం: అడిగే వారు లేరనే ధీమానో, అధికారం ఉందన్న అహంకారమో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హంద్రీనది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. కోడుమూరులోని ముడుమలగుర్తి రోడ్డు వైపు గల హంద్రీనది నుంచి భారీ యంత్రాల సాయంతో రోజుకు 300 నుంచి 400 ట్రాక్టర్ల వరకు ఇసుకను పగలు, రాత్రి తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. హంద్రీ నుంచి కోడుమూరు, కర్నూలు, గూడూరు, పత్తికొండ వంటి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. యంత్రాల సాయంతో కొన్ని మీటర్ల లోతు వరకు ఇసుకను తీస్తుండడంతో హంద్రీ నదిలో భారీగా గోతులేర్పడ్డాయి. హంద్రీ నుంచి భారీగా ఇసుకను తరలించుకుపోతుండడంతో భవిష్యత్తులో దొరకని పరిస్థితి నెలకొనే ప్రమాదముందని కోడుమూరు వాసులు తీవ్ర ఆందోళన చేందుతున్నారు.
అబద్ధాల ప్రచారం
ఇసుక అక్రమ రవాణాపై కోడుమూరు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో టీడీపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు విలేకరుల సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవా ణాలో తమకేమి సంబంధం లేదని చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు, ట్రాక్టర్ యాజమానులకు పనులు కల్పించడం కోసమే తాము అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు అబద్ధాలు చెప్పారు. అక్రమ ఆర్జనకే టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణా పట్టించుకోవడం లేదు.
పొంచి ఉన్న నీటి సమస్య
కోడుమూరు, వర్కూరు, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, ప్యాలకుర్తి, అనగొండ, అమడగుంట్ల, ఎర్రదొడ్డి వంటి గ్రామాల్లోని మంచినీటి పథకాలకు హంద్రీలోని బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. ఇప్పటికే హంద్రీలో ఇసుకమేటలు లేకపోవడంతో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉన్న కాస్త ఇసుకను కూడా తరలిస్తే భవిష్యత్తులో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదముంది. కోడుమూరుకు భారీ నీటి సమస్య పొంచి ఉంది. ఇప్పటికే హంద్రీలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో 4 నుంచి 5రోజులకోసారి పంచాయతీ అధికారులు కుళాయిలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉన్న కాస్తా ఇసుకను కూడా తరలిస్తే నీటి సమస్య తీవ్రమవుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే అండదండలతో..
ఇసుక దందా అంతా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. నదికై రవాడి గ్రామానికి చెందిన ఓ చోట నాయకుడు, మరో ఇసుక రీచ్ సూపర్వైజర్ కలిసి ఈ దందాకు తెర తీశారు. ఇప్పటికే 200 క్యూబిక్ మీటర్లుకు పైగా ఇసుక తరలించినట్లు అంచనా. నదికై రవాడి గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చిలకలడోణ ఎత్తిపోతల పథకం సమీపంలో పొలంలో ఐదు ట్రాక్టర్లు, జేసీబీతో ఇసుకను డంప్ చేసి, రాత్రి పూట లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం.
హంద్రీ నదిని యథేచ్ఛగా
తవ్వుతున్న టీడీపీ నాయకులు
తుంగభద్ర నది నుంచి
ఇసుక తరలింపు
జేసీబీ, హిటాచీ యంత్రాల
ఉపయోగం
నదుల్లో కనిపిస్తున్న భారీ గోతులు
చోద్యం చూస్తున్న అధికారులు


