కర్నూలు(హాస్పిటల్): వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తాలిమ్ ఏ హునర్’ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రోజా దర్గా ముతవల్లి సయ్యద్ దాదా బాషా ఖాద్రి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయి విద్యను భరించలేని మైనార్టీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్ మీడియట్ విద్యతో పాటు జేఈఈ, ఎంసెట్, నీట్, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5 కోట్ల వ్యయంతో 250 మంది విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు నాణ్యమైన విద్య, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని, ఈనెల 17వ తేదీన పరీక్ష ఉంటుందని తెలిపారు.
కర్నూలు కల్చరల్: కళావాహిని సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీక్యాంప్ కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల గాన కచేరి అలరించింది. అనమయ్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో సంగీత విద్వాంసులు రాఘవేంద్ర కుమార్, భార్గవిల బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ, మధుర కవి ఎలమర్తి రమణయ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అన్నమయ్య సంకీర్తనలు అజరామరమన్నారు. ఆయన తొలి తెలుగు వాగ్గేయ కారులు అన్నారు. కళావాహిని సాహితీ సంస్థ అధ్యక్షులు మనోహర్బాబు, హనుమంతరావు చౌదరి, సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


