వేతన వేదన!
● రెండు నెలలుగా శానిటేషన్ సిబ్బందికి
అందని వేతనాలు
● శ్రీశైల దేవస్థానంలో
పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి
● పద్మావతి సంస్థ నిర్లక్ష్యపు వైఖరిపై
మండిపడుతున్న కార్మికులు
● సున్నిపెంట కార్మికులకు
అదనపు భారంగా రవాణా చార్జీలు
శ్రీశైలంటెంపుల్: ‘అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి. ఏజెన్సీ మారి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందలేదు. దీంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. అక్టోబరు 1 నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రీలీవర్స్తో) మొత్తం కలిపి సుమారు 641మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం జీవో నెం.11 ప్రకారం నెలకు రూ.12,253 వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుపర్చారు.
రెండు నెలలు గడుస్తున్నా
అందని వేతనాలు
పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి రెండు నెలలు పూర్తయి మూడవ నెల గడుస్తున్నా ఇంత వరకు వేతనాలు చెల్లించలేదు. మొత్తం 641మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.12,253 నెలకు వేతనంగా చెల్లించాలి. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు రూ.10,690 ఇవ్వాలి. 641మంది కార్మికులకు గాను నెలకు రూ.68.52లక్షలు వేతనాలుగా చెల్లించాలి. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. సున్నిపెంట నుంచి వచ్చే సుమారు 300మంది కార్మికులు జీతాలు రాకపోగా, రవాణా చార్జీలకు నెలకు రూ.2వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.


