మీ కాల్ .. చేరుకోలేక పోతుంది!
శ్రీశైలం: భక్తుల రద్దీ పెరిగితే శ్రీశైల క్షేత్రంలో సెల్ సేవలు మూగబోతాయి. ఎప్పుడు ఏ కంపెనీ నెట్వర్క్ పని చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బాగా పని చేస్తుండగా ఇటీవల సిగ్నల్ హెచ్చుతగ్గులతో వినియోగదారులు హలో.. హలో..హలో అంటూ గొంతు చించుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్తో పాటు జియో, ఎయిర్టెల్ మొదలైన సెల్ టవర్లు ఉన్నా అవి కూడా సరిగా పని చేయడం లేదు. ఓ రోజు జియో సిగ్నల్స్ బాగుంటే మరో రోజు ఎయిర్టెల్ సిగ్నల్ ఎత్తిపోతుంది. ఇక బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ బాగా కనిపిస్తున్నా నెట్ సేవలు పూర్తిగా మందగించాయి. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు, ఫొటోలు డౌన్లోడ్ కావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఫోన్పే, గూగుల్పే పేటీఎం మొదలైన ఆన్లైన్ లావాదేవీలకు భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్లోని తమ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని ధీమాతో కొద్దిపాటి మొత్తంతో వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. స్వామివార్ల దర్శన టికెట్లకు, లడ్డు ప్రసాదాలను కొనుగోలుకు, వసతి సౌకర్యం పొందడానికి క్యాష్ రూపేనా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులు అయిపోతే అకౌంట్లోని డబ్బును క్యాష్ రూపంలో మార్చుకోవడానికి స్థానిక వ్యాపారస్తులను బతిమిలాడుకోవాల్సి వస్తోంది. శ్రీశైలంకు వచ్చే యాత్రికులు భక్తులు సెల్ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడం, ఒకవేళ ఉన్న క్యాష్ ట్రాన్స్ఫర్ జరగకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఏటా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి టెక్నికల్ మేనేజర్లు భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని సెల్ టవర్ బూస్టర్లను ఏర్పాటు చేస్తారు. శివరాత్రి ముగిశాక తిరిగి యథాస్థితి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికై నా ఆయా సంస్థల ప్రతినిధులు నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.
శ్రీశైలంలో భక్తులను వేధిస్తున్న
సెల్ నెట్వర్క్
ఆన్లైన్ లావాదేవీలకు అంతరాయం
శని, ఆది, సోమవారాల్లో
కాల్ కలిసిందంటే అదృష్టమే


