శ్రీగిరిలో వసతి పేరుతో ‘సైబర్’ దోపిడీ
● శ్రీశైలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
శ్రీశైలంటెంపుల్: దేవస్థాన వసతి గృహ సముదాయాల పేరుతో సైబర్ నేరగాళ్లు పలు నకిలీ వెబ్సైట్లను సృష్టించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, గౌరీసదన్, పాతాళేశ్వరసదన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. వసతి గదులు బుక్ చేశామని, తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేసుకుంటూ భక్తులను మోసగిస్తున్నారు. అలాగే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరితా రిసార్ట్ పేరుతో సైతం నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. సైబర్ నేరగాళ్ల ఐపీ అడ్రస్ ఒకసారి ఒకచోట, మరికొన్ని నిమిషాలకు మరోచోట చూపిస్తోంది.
శ్రీశైలం పీఎస్లో ఫిర్యాదు
ఇటీవల బెంగళూరుకు చెందిన భక్తుడు ఏపీ టూరిజం హరితా రిసార్ట్ పేరుతో వసతి గదిని బుక్ చేసుకుని మోసపోయిన ఘటనపై స్పంధించిన టూరిజం శాఖ, టూరిజం శాఖ శ్రీశైలం మేనేజర్తో శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నకిలీ వెబ్సైట్ల ముఠా దొరుకుతారో లేదో వేచిచూడాలి?
అందుబాటులోకి ఫోన్ నంబర్లు
నకిలీ వెబ్సైట్లను నమ్మి శ్రీశైల దేవస్థానంలో వసతి, ఆర్జితసేవా, దర్శనం టికెట్లను పొందవద్దని శ్రీశైల దేవస్థాన అధికారులు ప్రకటనలు చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి దేవస్థాన సమాచార కేంద్రం ఫోన్ నెంబర్లు 8333901351, 52, 53లను సంప్రదించవచ్చునని సూచిస్తున్నారు.


