రేషన్ బియ్యం పట్టివేత
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో 700 కేజీల రేషన్ బియ్యం పట్టుబడింది. వన్ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన శీను, అదే గ్రామానికి చెందిన దుర్గా వీరాంజనేయులు కలిసి శ్రీశైలంలోని స్థానికుల నుంచి తక్కువ ధరకు 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేశారు. తర్వాత 50 కేజీలు చొప్పున 14 సంచుల్లో నింపి వినుకొండకు తీసుకెళ్లటానికి బస్టాండ్కు తీసుకొచ్చారు. స్థానికులు గమనించి వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకొని రేషన్ బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే శీను, దుర్గ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
టెక్నికల్ కోర్సులు అభ్యసించేందుకు వెసులుబాటు
కర్నూలు(హాస్పిటల్): వైద్య ఉద్యోగులకు ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ వంటి టెక్నికల్ కోర్సులను ఇన్ సర్వీస్ కింద అభ్యసించేందుకు వెసులుబాటు కల్పించారని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాలు నాయక్ తెలిపారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో యూనియన్ ఆసుపత్రి శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ ఈ కోర్సులు చేసేందుకు ఈ నెల 21వ తేదిలోపు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంఎన్ఓల అదనపు హెచ్ఆర్ఏ తీసివేశారని, మళ్లీ అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలని డీఎంఈకు వినతి పత్రం ఇవ్వగా ఈ మేరకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో శాఖ కార్యదర్శి ఖాజాముద్దీన్, నాయకులు హరిచంద్రనాయుడు, శశిరెడ్డి, సుశీలమ్మ, భాగ్యమ్మ, రామేశ్వరమ్మ, రమేష్, ఉరుకుందయ్య, నరసింహులు, శ్రీనివాసులు, గీతాకళ్యాణి, జయలక్ష్మి, రాజు, లక్ష్మి, మంగమ్మ, శివలక్ష్మి పాల్గొన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
సి.బెళగల్: మండలంలో వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న ప్రమాదాల్లో త్రుటిలో ప్రాణాపాయాలు తప్పాయి. వివరాల్లోకి వెళితే.. పోలకల్ గ్రామం దగ్గర గూడూరు నుంచి ముడుమాలకు వస్తున్న ఖాళీ ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడిపోయిన డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే మండలంలోని ఇనగండ్ల క్రాస్ రోడ్డు దగ్గర గూడూరు – ఎమ్మిగనూరు ప్రధాన రోడ్డుపై భారీ గోతులు ఏర్పడ్డాయి. వీటిని తప్పించబోయిన ఇసుక లోడ్ టిప్పర్ రోడ్డు ప్రక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇనగండ్ల గ్రామ క్రాస్ రోడ్డు దగ్గర ప్రధాన రోడ్డును బాగు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.
వెల్దుర్తి: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఎరుకలి లక్ష్మన్న వద్ద నుంచి శనివారం దాదాపు 900 గ్రాముల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ సిబ్బందితో కలిసి నిందితుడి ఇల్లు, పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మండల పరిధిలోని మదార్పురం వద్ద నిందితుడు గంజాయి మొక్కలను కలిగి పట్టుబడ్డాడు. అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఓ అక్బర్బాషా, ఆర్ఐ మంజుల ఆధ్వర్యంలో పంచనామా అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత


