
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఇండోర్స్టేడియం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరుకు చెందిన అల్లూరి ప్రభాకర్, చెన్నమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్తకు దూరమై 15 సంవత్సరాల క్రితం పిల్లలతో సహా ఆమె కోవెలకుంట్లలో స్థిరపడింది. పట్టణంలోని ఓ మార్ట్లో తల్లితోపాటు కుమారుడు ధరణికుమార్(20) గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆ యువకుడు జమ్మలమడుగు చౌరస్తా నుంచి బైక్పై పట్టణంలోకి వస్తూ లారీ టైర్ల కింద పడ్డాడు. భారీ వాహనం కావడంతో శరీరభాగాలు నుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. వంద మీటర్ల దూరంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి సంఘటన స్థలానికి చేరుకుని ప్ర మాద వివరాలను సీఐ హనుమంతునాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఒక్కగానొక్క కుమారు డు మృతి చెందటంతో తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.