12 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు 10 నుంచి బంద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రప్రభుత్వం రవాణా వాహనాల ఫిట్నెస్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలిపివేసి బంద్ పాటించనున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో సోమవారం జరిగిన సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (సిమ్టా) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే గూడ్స్, షిప్ యార్డులకు వెళ్లే వాహనాలు, పౌర సరఫరాలకు ఉద్దేశించిన పన్నెండు సంవత్సరాలకు పైబడిన రవాణా వాహనాలు కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆపరేటర్లు ఈ బంద్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ రూ.1340 ఉన్న ఒక్కో వాహనం ఫిట్నెస్ చార్జీలను ఏకపక్షంగా రూ.33 వేలకు పెంచుతూ కేంద్రప్రభుత్వం గత నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పాత లారీల యజమానులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని, ఇప్పటికే దక్షిణ రాష్ట్రాల్లో వేలసంఖ్యలో లారీలు ఫిట్నెస్ చేయించుకోలేక నిలిచిపోయాయని తెలిపారు. పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఆ డిమాండ్ నెరవేరేవరకు 12 ఏళ్లకు పైబడిన లారీలు రోడ్లపై నడపకుండా ఆందోళన చేసేందుకు సిమ్టా సమావేశం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల నాయకులు పాల్గొన్నట్టు ఈశ్వరరావు తెలిపారు.
వైద్య విద్య ఉన్నతమైనది
పీసిమ్స్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్
గన్నవరం రూరల్: వైద్య విద్య ఉన్నతమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 2025 ఫ్రెషర్స్డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు టెలి మెడిసిన్ హాల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీలో తెల్ల కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. సేవా భావం, నైతిక విలువలు, చదువు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నత స్థానానికి తీసుకువెళతాయని విద్యార్థులకు సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్య చదివేందుకు చేరిన విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్కుమార్ పాల్గొన్నారు.


