వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీతారామ సమేత లక్ష్మణ హనుమత్ ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులచే వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల నడుమ శ్రీరాముల వారి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారి పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షించి పులకించారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో భ్రమరాంబలతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీరాముల వారి పట్టాభిషేకం విశేషాలను ఆలయ అర్చకులు చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.