సీవోఈ ఎదుట విద్యార్థుల ఆందోళన
బెల్లంపల్లి: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులలో ఇటీవల విలీనం చేసిన సిర్పూర్(టి) విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. అక్కడ గురుకుల భవనం శిఽథిలావస్థకు చేరుకోవడంతో 9, 10 తరగతుల విద్యార్థులను బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ కళాశాలకు షిఫ్ట్ చేశారు. 140 మంది సీవోఈ గురుకులంలో చదువుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న 600 మందికి తోడుగా అదనంగా 140 మంది రావడంతో సౌకర్యాల సమస్య ఏర్పడింది. దీంతో సిర్పూర్ (టి) గురుకుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమను వెంటనే వసతులు ఉన్న భవనంలోకి పంపించాలని విద్యార్థులు సీవోఈ కళాశాల గేట్ తెరిచి రోడ్డెక్కారు. లగేజీ సర్దుకుని ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. గమనించిన ప్రిన్సిపాల్ విజయసాగర్, కొంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్లి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిర్పూర్(టి) గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తిరిగి కళాశాలలోకి వచ్చారు.


