‘సంతానం’ నిబంధన ఎత్తివేత!
‘స్థానిక’ పోరులో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నా అర్హులే మంత్రివర్గ ఆమోదానికి గవర్నర్ రాజముద్ర ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీ, పరి షత్ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే నిబంధన ఎత్తివేతకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆపై గవర్నర్ కూడా ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరింత మంది ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు కన్న ఎక్కువ ఉంటే పోటీ చేయరాదనే నిబంధన ఎత్తివేయగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ, పరిషత్ ఎన్నికలకు ఉన్న నిబంధన కూడా ఎత్తివేసింది. గత స్థానిక ఎన్నికల్లో ఈ నిబంధన అమలులో ఉండగా చాలా మంది ఔత్సాహికులు పోటీకి దూరమయ్యారు.
1995 నుంచి నిబంధన అమలు..
1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదనే నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. జనాభా నియంత్రణలో భాగంగా 1995 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చట్టం చేసింది. దీంతో 1995 జూన్ తర్వాత జరిగిన ప్రతీ స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి దూరమయ్యారు. తాజాగా ఈ నిబంధన ఎత్తివేయడంతో ఎంతో మంది ఆశావాహులకు ఊరట లభించింది.
పోటీ పెరిగే అవకాశం..
సంతానం నిబంధన తొలగడంతో స్థానిక ఎన్నికల్లో పోటీ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే పోటీ అభ్యర్థుల సంఖ్య చాలా వరకు పెరగనుంది. మంచిర్యాల జిల్లాలో 306 సర్పంచ్ స్థానాలు, 2,680 వార్డు సభ్యుల స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలు, 18 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తానికి సంతానం ఎక్కువగా ఉన్నవారు ఎంతో కాలంగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి నిబంధన ఎత్తివేయడంతో వారికి కలిసి రానుంది.


