ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల నిల్వలకు గోదాముల సమస్య తలెత్తింది. జిల్లాలో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఇప్పటివరకు 40 కేంద్రాల ద్వారా 1.89 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేశారు. కానీ జిల్లాలో అవసరమైన గోదాములు లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మిర్చి మోడల్ మార్కెట్లోని ఐదు షెడ్లలో 25వేల మెట్రిక్ టన్నుల పంట నిల్వ చేశారు. ఆపై ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్లోని షెడ్లలో 3 వేల మెట్రిక్ టన్నులు, కూసుమంచి మండలం కల్లూరుగూడెం గోదాముల్లో కూడా నిల్వ చేస్తున్నారు. అయినా ఇంకా పంట ఉండడంతో రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, పాత సినిమా హాళ్లను పరిశీలిస్తున్నారు. ఇవికాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చిలుకూరు ప్రాంతాల్లో ఉన్న గోదాములను లీజ్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


