ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. పార్టీ జిల్లా సమితి సమావేశం బుధవారం ఖమ్మంలో జరగగా ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్ విధానం, ప్రలోభాలు తదితర అంశాలు బీజేపీ గెలుపు వెనక దాగి ఉన్నాయన్నారు. దేశంలో ధరలు పెరుగుతుండగా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రతీ సమస్యకు కర్మ ఫలమే పరిష్కారమనే వాదనను బీజేపీకి తెరపైకి తీసుకొస్తోందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా హిందుత్వ నినాదంతో ప్రజల మధ్య విభజన రేఖ తీసుకురావడం ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యం దాగి ఉందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిస్థాయిలో అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అంతేకాక ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొక్కజొన్నలు కొని రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని తెలిపారు. కాగా, పార్టీ ప్రజా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని హేమంతరావు కోరారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, పావులూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో
హేమంతరావు


