నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు 14వ తేదీ శుక్రవారం ఉదయం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి ఎస్సీ కాలనీ, పంగిడి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత కొణిజర్ల మండలంలోని అంజనాపురంలో గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలిస్తారు. ఇక శనివారం సాయంత్రం కేఎంసీ పరిధి లకారం చెరువులో చేపపిల్లలు విడుదల చేశాక, 49వ డివిజన్లో మామిళ్లగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రైళ్లలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం
ఖమ్మంక్రైం: రైళ్లలో గంజాయి రవాణాను సమూలంగా నిర్మించేలా విస్తృత తనిఖీలు చేపట్టాలని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి ఆదేశించారు. ఖమ్మం జీఆర్పీ స్టేషన్ను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా నమోదైన కేసులు, విచారణపై ఆరా తీశాక ఉద్యోగులతో సమావేశమయ్యారు. రైళ్లల్లో ప్రయాణికుల సామగ్రి చోరీలను అరికట్టేలా రాత్రి వేళ్ల గస్తీ పెంచాలని సూచించారు. అలాగే, గంజాయి రవాణా కట్టడికి ముమ్మర తనిఖీలు చేసేలా అన్ని జీఆర్పీ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. త్వరలోనే స్టేషన్లలో సిబ్బంది కొరత తీరనుందని చెప్పారు. తొలుత ఎస్పీ చందనాదీప్తికి ఖమ్మం జీఆర్పీ పోలీసులు స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. కాజీపేట డీఎస్పీ కృపాకర్, ఖమ్మం సీఐ అంజలి, ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
నీలాద్రీశ్వరుడిని
దర్శించుకున్న చాగంటి
పెనుబల్లి: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రిశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, చైర్మన్ చీకటి నర్సింహారావు, అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత చాగంటి దంపతులకు శేషవస్త్రాలు బహూకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మిట్టపల్లి నరేంద్ర, గంగిశెట్టి జగదీష్కుమార్, మాణికల ప్రసాద్, మామిళ్ల సత్యనారాయణ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీ.వీ.పాలెం పీఏసీఎస్లో నాబార్డ్ బృందం
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం నాబార్డ్ బృందం సందర్శించింది. ఈ బృందంలో అధికారులు శ్రేయస్ దేశ్పాండే, కృష్ణ కోల్హే, డీజీఎం వేణుగోపాల్రావుతో పాటు ఏబీ మార్గ్ బ్రాంచ్ మేనేజర్ హిందు, సూపర్వైజర్ జానీమియా ఉన్నా రు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు రావూరి సైదుబాబు, ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి ఐ.తిరుపతిరావు తదితరులు సంఘం ద్వారా మంజూరు చేస్తున్న బంగారు, పంట రుణాలు, డిపాజిట్లు, లాకర్లు, ఎరువులు, విత్తనాల నిల్వల వివరాలు వెల్లడించారు. సంఘం నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలే కాక ఆర్థిక లావాదేవీలపై నాబార్డ్ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని సీఈఓ తెలిపారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులతో హెచ్ఎంలు ఈ–పాస్ ద్వారా దరఖాస్తు చేయించాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు బ్యాంక్ పాస్బుక్, స్టడీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తు ఫారానికి ధ్రువపత్రాలను జతపరిచి తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన


