
ఇంతింతై.. వటుడింతై...
● నానాటికీ పెరుగుతున్న ఉమ్మడి జిల్లా జనాభా ● 2011 నాటికి 27.97 లక్షలుగా నమోదు ● ఇప్పుడు లెక్కిస్తే మరింత పెరిగే అవకాశం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల నమోదవుతోంది. 1951 నుంచి గణాంకాలను పరిశీలిస్తే మొదట పదేళ్లలో 30.88 శాతం పెరగ్గా.. 1971లో 29.54శాతానికి పెరగడం గమనార్హం. 2001లో 16.39 శాతం పెరుగుదల ఉండగా, 2011లో 8.47శాతమే నమోదైంది. అయినప్పటికీ ఏ దశాబ్దంలోనూ జనాభా పెరుగుదలకు బ్రేక్ పడలేదు. 1951లో ఉమ్మడి జిల్లా జనాభా 8,08,002 మంది ఉండగా చివరగా జనగణన జరిగిన 2011లో 27,97,370కి చేరింది. షెడ్యూల్ ప్రకారం 2021లో జనగణన చేయాల్సి ఉన్నా కరోనాతో చేపట్టలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 2027 వరకు జన గణన షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పునర్విభజనతో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఉన్నాయనే కారణంతో అప్పటి ఉమ్మడి ఖమ్మం, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇందులో కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గంపాడులోని 12గ్రామాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన గ్రామాలు ఉన్నాయి. ఇక 2016లో చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో, గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపారు. దీంతో జిల్లాల పునర్విభజన నాటికి 2011 జనగణన ప్రకారం ఖమ్మం జిల్లాలో 14,01,639 మంది జనాభా మిగిలారు. ఇందులో పురుషులు 6,99,124 మంది, సీ్త్రలు 7,02,515 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర జననాల సగటులో జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండగా, రోజుకు సగటున జిల్లాలో పది జననాలు నమోదవుతున్నాయి.
ఉమ్మడి జిల్లా జనాభా వివరాలు..
ఏడాది జనాభా
1951 8,08,002
1961 10,57,542
1971 13,69,892
1981 17,51,574
1991 22,15,809
2001 25,78,927
2011 27,97,370