
సార్వత్రిక సమ్మె సక్సెస్
ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల హక్కులను కేంద్రప్రభుత్వం హరించడమే కాక నాలుగు లేబర్ కోడ్ల ఏర్పాటును నిరసిస్తూ బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. దుకాణాలు, బ్యాంక్లు, పారిశ్రామిక వాడలను బంద్ చేయించగా, ఆర్టీసీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. బంద్లో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. సమ్మెకు ఉద్యోగులు, వ్యవసాయ, రైతుసంఘాలు మద్దతు తెలపగా, కార్మికసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యాన ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, ఖమ్మంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా, జిల్లావ్యాప్తంగా కూడా ర్యాలీలు చేపట్టారు.
ఆర్టీసీకి రూ.72 లక్షలు నష్టం
సార్వత్రిక సమ్మె సందర్భంగా దుకాణాలను మూసివేయించారు. జిల్లా కేంద్రంలో ఆటోలు పూర్తిస్థాయిలో తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా పాక్షికంగానే తిరిగాయి. రీజియన్లో 410 బస్సులకు గాను 210బస్సులనే అధికారులు నడిపించారు. రోజువారీగా రావాల్సిన రూ.1.40 కోట్ల ఆదాయంలో బుధవారం రూ.72లక్షల మేర కోత పడింది. ఇక పారిశ్రామిక ప్రాంతంలోని టైల్స్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజీలు, దాల్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలను మూసివేయించారు.
సమ్మె హక్కును కాలరాస్తున్నారు..
సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించగా జెడ్పీ సెంటర్ వద్ద వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ్మె జరిగిందని తెలిపారు. కార్మికులకు కష్టం వస్తే ఆదుకునే సంఘాలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాగం హేమంతరావు, మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకుడు కొత్త సీతారాములు తదితరులు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరో పించారు. ఇక బ్యాంకుల ఎదుట కూడా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, తుమ్మ విష్ణువర్ధన్, జి.రామయ్య, పి. శోభ, సింగు నరసింహారావు, బీ.జీ.క్లెమెంట్, తోట రామాంజనేయులు, ఎం.డీ.జకీరుద్దీన్, కొండపర్తి గోవిందరావు, దొండపాటి రమేష్, తాటి వెంకటేశ్వ ర్లు, తాటి నిర్మల, పోటు కళావతి, రామకృష్ణ, రామస్వామి, రాజేష్,కుమార్, బుచ్చిబాబు, బొమ్మకంటి రమేష్, జలం రమేష్, వెంకన్న, శ్రీను, సిల్వరాజు, ఐలయ్య, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ఉద్యోగులు, వ్యవసాయ,
రైతు సంఘాలు, పార్టీల మద్దతు
దుకాణాలు, పారిశ్రామిక ప్రాంతం, బ్యాంకులు బంద్
పాక్షికంగా తిరిగిన ఆర్టీసీ బస్సులు

సార్వత్రిక సమ్మె సక్సెస్