రాయచూరు రూరల్: ఈసారి పదవ తరగతి ఫలితాల్లో గణనీయమైన మార్పులు తెస్తామని రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 21వ స్థానం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది 15వ స్థానంలోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పాఠశాలల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే అభియాన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల కొరత నివారణకు అతిథి ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు.


