రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ పద్ధతిపై ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీలు కోతలు విధిస్తున్నా అధికారులు మౌనం వహించడం తగదని టీయూసీఐ సంచాలకుడు మానసయ్య డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న సీ, డీ గ్రూప్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడాన్ని తప్పుబట్టారు. జిల్లాలో 228 మంది ఉద్యోగులకు 9 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలు 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వీరిని విధుల నుంచి తొలగించినట్లు నాటకమాడి ఆ 4 నెలల గౌరవ వేతనాలను రూ.1.33 కోట్లను స్వాహా చేశారన్నారు. 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించక పోవడం తగదన్నారు. రూ.25 వేలకు బదులుగా కేవలం రూ.15 వేలు చెల్లించి చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. ఈ విషయంలో జడ్పీ సీఈఓ చర్యలు చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు.


