బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
సాక్షి, బళ్లారి: పేద కుటుంబంలో జన్మించి, కష్టపడి ఉన్నత విద్యనభ్యసించి, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం అంబేడ్కర్ పరినిర్వాణ దినోత్సవం(వర్ధంతి) సందర్భంగా నగరంలోని హొసపేటె రోడ్డులోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కాంస్య ప్రతిమకు కొప్పళ ఎమ్మెల్యే, రాబకొ చైర్మన్ రాఘవేంద్ర హిట్నాల్, బళ్లారి జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజ్, చిదానందప్ప తదితరులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగానికి యావత్ ప్రపంచ దేశాలు కితాబునిచ్చాయన్నారు. భారత దేశంలో పేదరిక నిర్మూలన, కులవివక్షతను రూపుమాపేందుకు పునాదులు వేయడంతో దేశంలో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలైందన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ దేశాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అన్ని పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఖ్యాతి.. దశదిశలా వ్యాప్తి
మహామానవతావాది డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ను బీజేపీ ఎంతో గౌరవించి ప్రపంచంలోనే ఆయన పేరును మరింత ఇనుమడింపజేసేలా కృషి చేసిందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సీనియర్ న్యాయవాది దాసరి గోవిందు పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్కు ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. దేశంలో పంచతీర్థాలను బీజేపీ రూపొందించిందని, వాటిలో ఆయన పుట్టిన స్థలం మధ్యప్రదేశ్లోని మావ్, లండన్లో ఉన్నత విద్యాభాస్యం చేసిన ప్రాంతాన్ని విద్యాభూమిగా, నాగ్పూర్లో బుద్ధదీక్ష తీసుకున్నందుకు దీక్షాభూమిగా, అంబేడ్కర్ శరీరం వదిలిన ప్రాంతాన్ని మహాపరినిర్వాణ స్థలంగా, ఆయన సమాధి అయిన ప్రాంతాన్ని చైతన్యభూమిగా ఈ ఐదు పవిత్ర స్థలాలను గుర్తించి పంచతీర్థాలుగా మార్చి, మ్యూజియంలు ఏర్పాటు చేసి దేశశ ప్రజలకే కాకుండా, యావత్ ప్రపంచానికి ఆయన ఖ్యాతిని మోదీ ఇనుమడింపజేశారన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా గుర్తించారన్నారు. ఈ మహత్తరమైన రోజు మోదీ ప్రభుత్వం వచ్చాక 2015లో అమల్లోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా అమలు చేసిందన్నారు. భారత దేశంలో అరుదైన, ఆణిముత్యంగా కీర్తి పొందిన అంబేడ్కర్ను ఎంతో గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలిపారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ పార్టీలకు చెందిన నేతలు, అధికారులు పూలమాలలు వేశారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 69వ పరినిర్వాణ దినంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, డీఎస్ఎస్ నేతలు రవీంద్రనాథ పట్టి, తిమ్మారెడ్డి, గురురాజ్, వెంకటేష్, జేడీఎస్ నేతలు విరుపాక్షి, మహంతేష్ పాటిల్, విశ్వనాథ్ పట్టి పాల్గొని పూలమాలలు వేశారు.
రాయచూరులో అంబేడ్కర్ ప్రతిమకు నాయకుల పుష్పాంజలి
బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు నేతల పుష్పాంజలి
ఆయన అడుగుజాడల్లో
ప్రతి ఒక్కరూ నడవాలి
అంబేడ్కర్ పరినిర్వాణ
దినోత్సవంలో వక్తలు
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్


