
డిజిటల్ అరెస్టుకు విద్యుత్ ఉద్యోగి బలి
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో భయపడ్డ బెస్కాం విద్యుత్ ఉద్యోగి లక్షలు పోగొట్టుకుని డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నపట్టణ తాలూకా కెలగెరె గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో బెస్కాం కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగి కుమార్ (42) మృతుడు. డెత్నోట్లో రాసిన ప్రకారం... విక్రమ్ గోస్వామి అనే వ్యక్తి వీడియో కాల్ చేసి తాను సీబీఐ అధికారినని చెప్పుకొన్నాడు. మీరు డిజిటల్ అరెస్టయ్యారు, కేసు నుండి బయటపడాలంటే రూ.11 లక్షలు కట్టాలి అని బెదిరించాడు. దీంతో భయపడ్డ కుమార్ వారు చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపించాడు. అయితే పదేపదే కాల్ చేస్తూ మరింత డబ్బు పంపాలని, లేదంటే అరెస్టు చేస్తామని వేధించసాగారు. భయపడ్డ కుమార్ డెత్నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సైబర్ క్రైం కు బదిలీ చేశారు.
మొబైల్ వ్యసనం..
బాలుని ఆత్మహత్య
హుబ్లీ: 10వ తరగతి చదువుతున్నావు, మొబైల్ని పక్కన పెట్టి శ్రద్ధగా చదవాలి అని అవ్వా తాత మందలించారని బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన హావేరి జిల్లా బ్యాడగి తాలూకా ఇస్లాం పుర గల్లీలో మంగళవారం చోటు చేసుకుంది. బాలల్లో పెరిగిపోతున్న మొబైల్ వ్యవసనానికి అద్దం పడుతోంది. వివరాలు.. రుద్రేష్ శివప్ప గంజిగట్టి (15) ది సిగ్గావి తాలూకా అయితే, చదువుకోవడం కోసం అవ్వతాత ఊరైన ఇస్లాంపురలోని మల్లికార్జున బజప్పమఠ ఇంట్లో ఉండేవాడు. తరచు మొబైల్ఫోన్ను చూస్తూ ఉండడంతో కాస్త చదువు పై దృష్టి సారించు అని నాలుగు మంచి మాటలు చెప్పారు. దీంతో ఆవేదన చెందిన రుద్రేష మంగళవారం సాయంత్రం ఇంటి వెనుక గదిలో ఉరివేసుకుని మరణించాడు.
రూ. 38 లక్షల సైబర్ మోసం
హుబ్లీ: ఆన్లైన్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి రూ.38 లక్షలు దోచేశారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చునని స్థానిక పాత హుబ్లీ ముస్తాక్ ఖాద్రికి వాట్సాప్ సందేశం పంపించారు. లింక్ నొక్కగానే అతని బ్యాంకు ఖాతా దుండగుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రూ.38 లక్షలు బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.
హంపీ జూలో బుజ్జి హిప్పో
హొసపేటె: పర్యాటక నగరి హంపీ దగ్గర కమలాపురలోని జూ పార్క్లో కొత్త అతిథి వచ్చింది. బుధవారం మంగళూరు దగ్గర పిలికుల జూ పార్క్ నుండి చింటు అనే మగ హిప్పోపొటామస్ను తీసుకొచ్చారు. జూలో జంతు వైవిధ్యం కోసం తెచ్చారు. దీని వయసు ఆరేళ్లు అని జూ అధికారి రాజేష్ నాయక్ తెలిపారు. ఏనుగు వంటి భారీ కాయం ఉండడం చేత హిప్పోను తెలుగులో నీటి ఏనుగు అని పిలుస్తారు.
ఆర్టీసీ ఉద్యోగుల
సమ్మె హెచ్చరిక
శివాజీనగర: వివిధ డిమాండ్లను తీర్చకుంటే ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల విన్నపాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి ఆరోపించింది. ఒక వారంలో సమావేశమవుదామని సీఎం సిద్దరామయ్య చెప్పారు, ఇంతవరకు చర్చలకు పిలవలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సమానమైన జీతం ఇవ్వాలి, సంస్థలో ప్రైవేటీకరణ, అవినీతిని అరికట్టాలి, కార్మికులపై వేధింపులను నిలిపేయాలి, ఉచిత వైద్య వసతి కల్పించాలి, విద్యుత్ బస్సుల డ్రైవర్లకు సంస్థ ఉద్యోగులనే నియమించాలి, గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని పలు డిమాండ్లు చేశారు.
కొల్లాపురదమ్మ ఉత్సవాలు
తుమకూరు: నగరంలోని హనుమంచపురంలోని శ్రీ పేట కొల్లాపురదమ్మ ఆలయంలో గురు, శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా బుధవారం నుంచి కొల్లాపురదమ్మకు ప్రత్యేక పుష్పాలంకరణ, విశేష పూజలు నిర్వహించారు.

డిజిటల్ అరెస్టుకు విద్యుత్ ఉద్యోగి బలి

డిజిటల్ అరెస్టుకు విద్యుత్ ఉద్యోగి బలి

డిజిటల్ అరెస్టుకు విద్యుత్ ఉద్యోగి బలి